ప్రభాకరుడు ప్రకాశిస్తూ ప్రపంచానికి వెలుగు ప్రసరిస్తూ
ప్రగతి కోసం పయనించండని హెచ్హరిస్తున్నాడు
అరవిరిసిన పద్మం ఆహ్వానం పలుకుతోంది
ఆహ్లాదం కలిగిస్తూ శాంతి పావురం యెగురుతోంది
శాంతి లేదు శాంతి లేదు అని మనోవిహంగం యెగసిపడుతోంది
నేటి భారతం కార్పణ్య నిలయమై కాలుష్యం విరజిమ్ముతోంది
అవినీతికి పట్టం కట్టిన పాలకులున్న దేశంలో
దానవత్వానికి దైవత్వాన్ని అపాదిస్తున్న దివాంధులం
గతం ఘనమని నినదిస్తూ నేటి నేతల పాలన చూస్తూ
ధర్మదేవత దగా పడ్డది లేవరా!
నివురుగప్పిన నిప్పులా ఇటు కూలపడితే కాదురా!
ఋణముతీర్చగ దేశమాతకు కొడుకువై రావేమిరా?
విశ్వశాంతికి దారిజూపే విజ్ఞానమూర్తివై లేచిరా !
వెలుగులీనే వేకువై నువు వేగమేరావాలిరా!
గాంభీర్యానికి మారుపేరై విలసిల్లే సాగరుడే
శివమెత్తిన కోపంతో తరంగతాడిత ఘీంకారంతో
విలయతాండవం చేస్తున్నాడు!
సమస్యలతో సహజీవనం చేస్తూ
ఆల్లకల్లోలాంతరంగాన్ని అణచలేక ఆక్రోశిస్తూ
ఆత్మశాంతికై అలమటిస్తూ
ప్రభాతసమయ ప్రశాంతికోసం తపిస్తూ
కన్నీటి కడలిలా మారినప్పుడు
ఋణము తీర్చగా, దేశమాతకు కొడుకువై రావేమిరా!
--- చల్లా మైత్రేయి